Lok Sabha | లోక్సభ (Lok Sabha) ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను శనివారం విడుదల చేసింది. మొత్తం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. ఇప్పుడు కమలం పార్టీ రెండో జాబితాను సిద్ధం చేస్తోంది. తొలి జాబితాలో చోటు దక్కని ఆశావహులు రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. సెకెండ్ లిస్ట్ను ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే, బుధవారం నాడు బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా (BJPs Second List) విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు అవకాశం లభించగా 28 మంది మహిళలకు చోటు దక్కింది. ఇద్దరు మాజీ సీఎంలకు బీజేపీ అవకాశం కల్పించింది. 57 మంది ఓబీసీలకు తొలి జాబితాలో స్థానం కల్పించారు. తొలి జాబితాలో యువతకు 47 స్ధానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్ధానాలను కేటాయించామని పార్టీ నేత వినోద్ తావ్డే తెలిపారు. కీలక యూపీ నుంచి 51 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, ఢిల్లీ నుంచి బరిలో నిలిచే 5గురి పేర్లను తొలి జాబితాలో వెల్లడించారు. ఇక తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులకు తొలి జాబితాలో చోటు దక్కింది.
కాగా, వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం దేశంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్గాంధీ ఓ వైపు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తుండగా.. వివిధ రాష్ట్రాల్లో విజయ సంకల్ప యాత్రల పేరుతో బీజేపీ కూడా జోరుగా ప్రచారం చేస్తోంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించాయి.
Also Read..
DK Shivakumar | మా ఇంట్లో బోరు కూడా ఎండిపోయింది.. బెంగళూరు నీటి సంక్షోభంపై డీకే శివకుమార్
Red Sea | మరోసారి రెచ్చిపోయిన హౌతీలు.. రెడ్ సీలో రెండు యూఎస్ నౌకలపై దాడులు
Underwater Metro Train | అండర్వాటర్ మెట్రో ప్రారంభించిన మోదీ.. విద్యార్థులతో కలిసి తొలి రైడ్