న్యూఢిల్లీ: బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రాంతీయ పార్టీలకు ముప్పు అని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం (Chidambaram) అన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన పార్టీలన్నీ ఇండియా బ్లాక్లో ఉండాలని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నానని చెప్పారు. ఆయన కొత్త పుస్తకం ‘ది వాటర్షెడ్ ఇయర్-ఇండియా ఏ మార్గంలో వెళ్తోంది?’పై అన్న దానిపై పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన చర్చా కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పీటీఐతో మాట్లాడారు. ఇండియా బ్లాక్ కూటమి కమిటీలో తాను లేనని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ కూటమి భవిష్యత్తు గురించి తాను ఏమీ చెప్పలేనని అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లోని నిర్దిష్ట ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి సంక్షోభం కలుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో మిగిలిన పార్టీలన్నీ ఇండియా బ్లాక్లో ఉండాలని తాను హృదయపూర్వకంగా ఆశిస్తున్నానని అన్నారు.
కాగా, త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో అయోధ్య రామమందిరం ఒక అంశం అవుతుందని చిదంబరం తెలిపారు. అయితే అది నిర్ణయాత్మకమైనదేనా అన్నది కాలమే చెబుతుందని అన్నారు.
సుస్థిరమైన, బలమైన రాజకీయ పార్టీలతో ఇండియా కూటమిని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని అన్నారు.