న్యూఢిల్లీ : హిమాచల్ప్రదేశ్, హర్యానా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై.. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ స్పందించారు. బీజేపీ ఓటమి.. రైతుల ఉద్యమ విజయంగా అభివర్ణించారు. బుధవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘వారు ఈ దేశ ప్రజలను అణచివేయాలని చూస్తున్నారు. వారి బలమైన వ్యూహాలు పెరుగుతున్నాయి. దేశాన్ని అమ్మేయాలని అనుకుంటున్నారు. ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరుగుతోంది.
ప్రజలు వారి పాలనపట్ల విసిగిపోతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. హిమాచల్ప్రదేశ్, హర్యానాల్లో బీజేపీ ఓడిపోయిందని, ఈ ఓటమిని వారితో కలత చెందిన ప్రజలు బహుమతిగా ఇచ్చారన్నారు. బీజేపీ ఓటమి.. మా ఉద్యమ విజయం అని తికాయిత్ పేర్కొన్నారు. హర్యానాలోని ఎల్లెనాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండియన్ నేషనల్ లోక్దళ్ అభ్యర్థి అభయ్ సింగ్ చౌతాలా విజయం సాధించడంపై స్పందించారు.
‘చౌతాలాకు మద్దతు ఇచ్చి రైతుల ఉద్యమానికి ప్రజలు తమ ఆమోద్ర ముద్ర వేశారు’ అన్నారు. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఆ రాష్ట్రంలో ఉద్యమాన్ని బలోపేతం చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్రం రైతుల మాట వినకుంటే బీజేపీకి ఓటమి తప్పదన్నారు. వారి వాగ్ధానాలు, చర్యలు భిన్నంగా ఉన్నాయని, వారు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు.