న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తూ వారిపైకి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆమ్ఆద్మీ పార్టీ మరోసారి విరుచుకుపడింది. దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆప్ ఎంపీ రాఘవ్చద్దా మండిపడ్డారు. దేశంలో ఒకటే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని బీజేపీ కోరుకుంటున్నదని ఆయన విమర్శించారు.
అందుకే ఎదిరించిన ప్రతీ ప్రతిపక్ష నాయకుడిని బీజేపీ జైల్లో పెడుతున్నదని రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలను వేధింపులకు గురిచేస్తున్నదని ఆయన ఫైరయ్యారు. మొత్తానికి దేశాన్ని ఒక నియంతృత్వ దేశంగా మార్చాలన్నదే బీజేపీ అభిమతంగా కనిపిస్తున్నదని చద్దా ఆరోపించారు.