Rajasthan Elections | జైపూర్, నవంబర్ 23: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. గత నెలన్నర రోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి. రాజస్థాన్లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. కరన్పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఇటీవల మరణించారు. దీంతో మిగిలిన 199 నియోజకవర్గాలకు ఒకే విడతగా శనివారం(ఈ నెల 25న) పోలింగ్ జరుగనున్నది.
దాదాపు 5.25 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ప్రచారంతో హోరెత్తించాయి. ఆయా పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. తమ ప్రభుత్వ పనితీరు, పథకాలతో కాంగ్రెస్ ప్రచారం చేపట్టింది. ఇక రాష్ట్రంలో మహిళలపై పెరిగిన నేరాలు, అవినీతి, పేపర్ లీకులను లక్ష్యంగా చేసుకొని కమలం పార్టీ పెద్దయెత్తున ప్రచారం చేసింది.
2018 నుంచి కలహాల కాపురమే.
రాజస్థాన్లో 2018లో అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ వ్యవహారం మొదటి నుంచి కలహాల కాపురంగానే సాగింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు హస్తం పార్టీకి తలనొప్పిగా మారాయి. వీరిద్దరి వైరం పార్టీని దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇండియా కూటమిలోని ఆప్ వంటి పార్టీలు విడిగా పోటీచేస్తున్న నేపథ్యంలో ఇది కాంగ్రెస్ గెలుపోటములపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
కాంగ్రెస్ హామీలన్నీ హుళక్కే!
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడిచింది. ఐదేండ్లు అధికారంలో ఉన్నా హామీల అమలులో హస్తం పార్టీ ఘోరంగా విఫలమైందని, ఏ ఒక్కదాన్నీ సంపూర్ణంగా నెరవేర్చలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, యువతులకు ఉచిత విద్య, రూ.3,500 నిరుద్యోగ భృతి, రూపాయికే కిలో గోధుమలు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్ సదుపాయం తదితర హామీలిచ్చిన ఆ పార్టీ అమలులో చేతులెత్తేసింది. ఉచిత విద్యుత్తు విషయం అటుంచితే గృహ వినియోగ విద్యుత్తు బిల్లులను పెంచేసింది.
బీజేపీకి అసంతృప్తుల భయం
రాష్ట్ర బీజేపీ పూర్తిగా ప్రధాని మోదీ చరిష్మానే నమ్ముకొన్నది. ఇందుకు అనుగుణంగా ఆయన రాజస్థాన్లో పెద్దయెత్తున ప్రచార సభల్లో పాల్గొన్నారు. రోడ్షోలు చేపట్టారు. మరోవైపు పార్టీలో నెలకొన్న అసంతృప్తి బీజేపీని కలవరపరుస్తున్నది. మాజీ సీఎం వసుంధరా రాజే వర్గీయులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆమె వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. టికెట్ రాని పలువురు నేతలు, వారి అనుచరులు ఏకంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు చేశారు. కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇవ్వడంపై నిరసనలు వ్యక్తం చేశారు.