భోపాల్, మే 21: ‘నీ పేరు మహమ్మదే కదా. ఏంటీ కాదా..? నిజం చెప్పు.. ఏదీ నీ ఆధార్ కార్డు చూపించు’ అంటూ మతిస్థిమితం లేని 65 ఏండ్ల వృద్ధుడిని ఓ బీజేపీ కార్యకర్త దారుణంగా కొట్టాడు. ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో జరిగింది. వృద్ధుడి పేరు భన్వరీలాల్ జైన్. మే 15న తప్పిపోయాడు. శుక్రవారం నీముచ్ జిల్లాలో రోడ్డు పక్కన జైన్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు.
అయితే, వృద్ధుడిని బీజేపీ కార్యకర్త దినేశ్ కుశ్వాహా కొడుతున్న వీడియో ట్విట్టర్లో వైరల్ అయింది. ఇది జైన్ కుటుంబం దృష్టికి వచ్చింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు కుశ్వాహాపై నీముచ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల్లేవని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ ఆరోపించారు. ‘మధ్యప్రదేశ్లో అసలు ఏం జరుగుతున్నది? సేవని, గునా, మో, మాండ్లలో గిరిజనులను చంపేశారు. ఇప్పుడు ఓ వృద్ధుడిని అనుమానంతో చంపేశారు’ అని ట్వీట్ చేశారు.