Chandigarh | చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ఆప్ ఝలక్ ఇచ్చింది. ఈ రెండు జాతీయ పార్టీలను వెనక్కి నెట్టేసి 14 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 12 స్థానాలను దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే సరిగ్గా మేయర్ ఎన్నిక సమయానికి ఆప్కు బీజేపీ ఝలక్ ఇచ్చింది. మేయర్ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. సరబ్జీత్ కౌర్ చండీగఢ్ మేయర్గా ఎన్నికయ్యారు. మొత్తం 28 ఓట్లుండగా, అందులో 14 మంది కౌన్సిలర్లు సరబ్జీత్ కౌర్కు మద్దతిచ్చారు. దీంతో బీజేపీ మేయర్ స్థానాన్ని చేజిక్కించుకుంది.
ఎన్నికల్లో బీజేపీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నా… మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై ఆమ్ఆద్మీ తీవ్రంగా మండిపడింది. మేయర్ ఎన్నిక సమయంలో ఆప్ తీవ్ర హంగామా చేసింది. ఆప్ కౌన్సిలర్లు అక్కడే ధర్నాకు దిగారు. తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో గందరగోళాన్ని సృష్టించి, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందని ఆప్ నేతలు ఆరోపించారు.
చండీగఢ్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంపై కేంద్ర మంత్రి, పంజాబ్ ఇన్చార్జీ గజేంద్ర సింగ్ షెకావత్ హర్షం వ్యక్తం చేశారు. నూతన మేయర్గా ఎన్నికైన సరబ్జిత్ కౌర్కు శుభాకాంక్షలు తెలిపారు. నిరసన వ్యక్తం చేస్తూ ఆప్ సానుభూతిని పొందాలని చూస్తోందని ఆరోపించారు. పంజాబ్లో అధికార పగ్గాలు చేపట్టడానికి బీజేపీకి సత్తా ఉందని షెకావత్ ధీమా వ్యక్తం చేశారు.