Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం దక్కింది. మధ్యప్రదేశ్లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. 2026 రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేశ్ కేవత్. ఈ మూడింటిలో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ మహిళా నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, ఆమె నామినేషన్ను ఈసీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆ స్థానం బీజేపీకి దక్కింది. నామినేషన్ల తిరస్కరణ ప్రక్రియ పూర్తి కావడంతో పోటీలో మూడు స్థానాలకు ముగ్గురు బీజేపీ అభ్యర్తులు మాత్రమే మిగిలారు. దీంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఈసీ ప్రకటించింది. వారికి నియామక పత్రాల్ని కూడా ఈసీ అందించింది. నిజానికి ఈ ఎన్నిక ఈ నెల 18న జరగాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ అభ్యర్తి మీనాక్షి నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. తెలంగాణలో నమోదైన ఒక కేసుకు సంబంధించి ఆమె వివరాలు పేర్కొనలేదని చెబుతూ మీనాక్షి నామినేషన్ను తిరస్కరించింది.
ఈ విషయంపై బీజేపీ తగిన ఆధారాల్ని ఈసీకి సమర్పించింది. వాటిని పరిశీలించిన ఈసీ.. మీనాక్షి అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఉన్నాయని భావించి, ఆమె నామినేషన్ రద్దు చేసింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో బీజేపీ, ఈసీ కలిసి కుట్ర పన్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్తానాన్ని ఆశ్రయించింది. 12వ తేదీన సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.