లక్నో: ఉత్తరప్రదేశ్తోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటన, ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపలేదు. లఖింపూర్ ఖేరీ పరిధిలోని మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసి అందరినీ విస్మయానికి గురి చేసింది. గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో రోడ్డు పక్కగా నిరసన చేస్తున్న రైతులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్లోని వాహనంతో తొక్కించాడు. ఈ ఘటనతో పాటు ఆ వెంటనే చెలరేగిన హింసాకాండలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, వాహనం డ్రైవర్ మరణించారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. అధికారంలో ఉన్న బీజేపీ ఈ కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను చాలా రోజుల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ముందు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీపై లఖింపూర్ ఖేరీ ఘటన ఎలాంటి ప్రభావం చూపలేదు. లఖింపూర్ ఖేరీ పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాలైన పాలియా, నిఘాసన్, గోలా గోకర్నాథ్, శ్రీ నగర్, ధౌరాహ్రా, లఖింపూర్, కస్తా, మొహమ్మది సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రైతులతోపాటు యూపీలోని విపక్ష పార్టీలను ఇది విస్మయానికి గురి చేసింది.