ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి భారీ షాక్ తగిలింది. ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. మూడు సీట్లను బీజేపీ గెలుచుకున్నది. అధికార కూటమికి మరో మూడు సీట్లు దక్కాయి. అయితే ఓట్ల కౌంటింగ్ సుమారు 8 గంటల పాటు ఆలస్యం జరిగింది. బీజేపీ తరపున మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు గెలిచినవారిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మాజీ మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్లు ఉన్నారు. శివసేన పార్టీ తరపున సంజయ్ రౌత్, ఎన్సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్ఘడ్లు రాజ్యసభకు ఎంపికయ్యారు.
మహారాష్ట్రలో మొత్తం 284 ఓట్లు కాగా.. గోయల్కు 48, బోండేకు 48, మహాదిక్కు 41.56, రౌత్కు 41, ప్రతాప్ఘడ్కు 44, ప్రపుల్ పటేల్కు 43 ఓట్లు పోలయ్యాయి. ఆరవ స్థానం కోసం బీజేపీ, శివసేన మధ్య టైట్ పోరు సాగింది. ఆ స్థానం కోసం బీజేపీ తరపున మాజీ ఎంపీ ధనంజయ్ మహాదిక్, శివసేన తరపున సంజయ్ పవార్లు పోటీపడ్డారు. ఆ పోరులో సంజయ్ పవార్ ఓటమి పాలయ్యారు. వాస్తవానికి మహాదిక్, పవార్లు.. కోల్హాపూర్ ప్రాంతానికి చెందినవాళ్లే. ఆరో సీటు అంశంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి. ఓ దశలో ఎన్నికల సంఘాన్ని కూడా ఆ పార్టీలు ఆశ్రయించాయి.
దాదాపు 8 గంటలు ఆలస్యంగా కౌటింగ్ ప్రారంభమైంది. క్రాస్ ఓటింగ్ జరిగిన బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. అయితే రిటర్నింగ్ ఆఫీసర్కు ఈసీ ఆదేశం తర్వాత.. శివసేన ఎమ్మెల్యే సుహాశ్ ఖండే ఓటును రద్దు చేశారు. ఆ తర్వాత రాత్రి ఒంటి గంటకు కౌంటింగ్ను నిర్వహించారు. తొలి ఫలితాన్ని మొదటి రెండు గంటల్లోనే రిలీజ్ చేశారు. మహా వికాశ్ అఘదిలో పొరపాటు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది.