కోల్కత్తా, జూలై 21: 2024 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా తుడిచిపెట్టుకుని పోతుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను గెలుచుకోలేదని పేర్కొన్నారు. అదే జరిగితే మిగతా పార్టీలన్నీ కలసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని తెలిపారు. వచ్చే ఎన్నికలు ‘బీజేపీని తిరస్కరించేందుకు ఓటేయండి’అన్న నినాదంతో జరుగుతాయని చెప్పారు.
‘దేశాన్ని బీజేపీ బందీఖానా నుంచి విడిపించండి. బీజేపీ సంకెళ్లు తెంచండి. 2024లో ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే’అని పిలుపునిచ్చారు. అయినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అధికారాన్ని దూరం చేస్తారని వివరించారు. ప్రతిపక్షాలపై కక్ష సాధించుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలతో వేధింపులకు పాల్పడుతున్నదని కేంద్రంపై మండిపడ్డారు. అసలు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకోని వారు ఇప్పుడు దేశ చరిత్రను మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
జీఎస్టీ పెంపుపై మండిపాటు
పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, పిండిపై జీఎస్టీ విధించడంపై మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయమని మండిపడ్డారు. ప్రతి ఒక్క పదార్థంపై బీజేపీ జీఎస్టీ విధిస్తే ప్రజలు ఏం తినాలని ప్రశ్నించారు. పేద ప్రజలు దేశంలో ఎలా బ్రతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చినట్టు పశ్చిమబెంగాల్లో కుట్రలు చేయాలనుకుంటే అందుకు తగ్గ సమాధానం గట్టిగానే చెబుతామని హెచ్చరించారు. ‘ఇది రాయల్ బెంగాల్ పులి అడ్డా అని బీజేపీకి గుర్తుచేస్తున్నా. ఇక్కడి విషయాల్లో జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. అందుకు తగ్గ సమాధానం వస్తుంది జాగ్రత్త!’ అని తీవ్ర హెచ్చరికలు చేశారు.