లక్నో: కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్లో ఏడు దశల్లో, మణిపూర్లో రెండు దశల్లో, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్లో ఒక దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ( Yogi Adityanath ) తమ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై కామెంట్ చేశారు.
ఈ ఎన్నికల్లోనూ తామే గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అంతేగాక భారీ మెజారిటీ కూడా ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతాపార్టీ మళ్లీ విజయం సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని యోగి వ్యాఖ్యానించారు.