(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీజేపీపై ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐని ఒక్కరోజు తనకు అప్పగిస్తే సగం బీజేపీ నాయకులు జైల్లోనే ఉంటారని పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల సందర్భంగా గురువారం ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్ర సర్కారు తనతోపాటు ఆప్కు చెందిన ఎమ్మెల్యేలందరినీ ఏదో కేసులో ఇరికించాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికి తమ ఎమ్మెల్యేలపై 167 అవినీతి కేసులు పెట్టిందని, అందులో 135 కేసులు కొట్టేశారని చెప్పారు. సీబీఐ అధికారులు ఇప్పటికీ 400 ఫైళ్లను పరిశీలించారని, అయినా తనను ఎందులోనూ ఇరికించలేకపోయారని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతి ఫైల్ను కావాలని తొక్కి పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీనే మెజార్టీ సాధిస్తుందన్నారు.
సంపన్నులకు ఎలా మాఫీ చేస్తారు?
తాము రేవడి (తాయిలాలు) సంస్కృతికి విరుద్ధమని చెబుతున్న మోదీ.. సంపన్నులకు ఎలా వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అదానీ, అంబానీలాంటి బడాబాబులకు కోట్లాది రుణాలు ఎందుకు మాఫీ చేస్తున్నారని నిలదీశారు. పేదలకు కల్పించే ఉపాధి, విద్య, వైద్యం, పారిశుధ్యం, విద్యుత్తు లాంటి కనీస వసతులు తాయిలాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు.
కేజ్రీవాల్ను చంపేందుకు బీజేపీ కుట్ర
గుజరాత్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేపీ కుట్రపన్నుతున్నదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఈ కుట్రలో బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయమున్నదని, కేజ్రీవాల్పై దాడి చేయాలని తమ గూండాలను ఆయన బహిరంగంగానే పురిగొల్పుతున్నారని పేర్కొన్నారు. ఈ చౌకబారు రాజకీయాలకు తమ పార్టీ భయపడబోదని, బీజేపీ గూండాయిజానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు.