Karnataka elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ప్రాంతీయ, జాతీయ మీడియా సర్వేలు, ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లో.. ఏ ఒక్కటీ బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పడం లేదు. గతంలో వెలువడిన సర్వేలు, తాజాగా సర్వే నివేదికలు అన్నీ ముక్తకంఠంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, లేకుంటే కాంగ్రెస్కు విజయావకాశాలు కొద్దిగా మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నదని తేల్చేశాయి. అంతే తప్ప కమలం పార్టీ మరోసారి గద్దె ఎక్కే చాన్సే లేదని, ఆ దిశగా రాష్ట్ర ఓటర్లు నిర్ణయం తీసుకొన్నారని స్పష్టం చేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడితే.. అటువంటి పరిస్థితుల్లో అందరూ ఊహించినట్టుగానే జేడీఎస్ పాత్ర మరోసారి కీలకమవుతుంది. కర్ణాటకతో పాటు ఈ ఏడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ర్టాలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. కర్ణాటక ఫలితాలు జరుగబోయే రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ భవిష్యత్తుకు ప్రీ ఫైనల్గా పరిణమిస్తాయని బీజేపీ భావిస్తున్నది.
ఓటమి భయంతో తాయిలాలు
కర్ణాటకలో తిరిగి గెలిస్తే దక్షిణాదిలో పాగా వేయవచ్చని బీజేపీ గంపెడాశలు పెట్టుకున్నది. కానీ తానొకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలచినట్టు కర్ణాటక ఎన్నికలు తమకు ఏ కోశానా ఆశాజనకంగా కనిపించకపోయినప్పటికీ దింపుడు కళ్లెం ఆశతో బీజేపీ జీవన్మరణ పోరాటం సాగిస్తున్నది. అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ముందే గ్రహించిన బీజేపీ అధినాయకత్వం.. ఎలాగైనా గట్టెక్కాలని తన దృష్టిని పూర్తిగా కర్ణాటకపైనే కేంద్రీకరించింది. బడ్జెట్ కేటాయింపులో ప్రాధాన్యం, అదనంగా రాయితీలు, కొత్త ప్రాజెక్టులు ఇచ్చింది. అయినా ఈసారి తిరిగి అధికారంలోకి రావడం కల్లేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
4 నెలల్లో ప్రధాని 9 పర్యటనలు
గత నాలుగు నెలల్లో ప్రధాని మోదీ 9 సార్లు కర్ణాటకలో పర్యటించారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్ణాటక చుట్టూ ప్రదక్షిణలు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కర్ణాటకలో పార్టీ పరిస్థితి మరింత బలహీనపడింది. సీనియర్లు, పార్టీ విధేయులకు టిక్కెట్లు నిరాకరించడం, పార్టీ గెలిచే అవకాశం లేదన్న అంచనాతో ఎన్నికలకు ముందే బీజేపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరిగాయి. సీనియర్ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవదితో పాటు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మునిగే పడవలో కొనసాగడం కంటే కాంగ్రెస్, జేడీఎస్లో చేరడం మేలని అక్కడకు వెళ్లిపోయారు.
జేడీఎస్ కింగ్ మేకర్!
మరో పది రోజుల్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే.. జేడీఎస్ కీలకమయ్యే చాన్స్ ఉన్నది. తాజాగా ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేలో కూడా ఇదే తేలింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో హంగ్ ఏర్పడుతుందని, తదనంతరం జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ కాబోతుందని పేర్కొన్నాయి. కాగా సీ ఓటర్, టీవీ9, ఆత్మసాక్షి సర్వే నివేదికలేమో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీతో మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్నాయి.
బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటర్ల డాటా
బెంగళూరు (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది. ఓటర్ల వ్యక్తిగత వివరాలు అన్నీ ఓ బీజేపీ అభ్యర్థి చేతికి రావడం సంచలనం సృష్టించింది. మల్లేశ్వరం నియోజక వర్గం నుంచి మంత్రి అశ్వత్థ నారాయణ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఓటర్లకు ఎస్ఎంఎస్, వాట్సాప్ సందేశాల ద్వారా వారి ఓటరు ఐడీ కార్డు వివరాలు పంపి.. తమకే ఓటేయాలని కోరటం వివాదాస్పదమైంది. ‘నా ఓటరు ఐడీ కార్డు వివరాలతో మీ సంతకంతో నాకు ఎస్ఎంఎస్ వచ్చింది. డాటాను అక్రమంగా పొందేందుకు ఎంత ఖర్చు చేశారో కూడా తెలపండి’ అని వేణు మాధవ్ అనే వ్యక్తి అశ్వత్థ నారాయణను ట్విట్టర్ లో ప్రశ్నించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితిలో ఎన్నికల సంఘమూ ఓటర్ల ఫోన్ నంబర్లను అభ్యర్థులకు అందించే అవకాశమే లేదు. తాజా ఘటనపై విచారణ జరపాలని స్థానిక ఓటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.