స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ‘ఈశాన్యంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వమే’ అని ఇటీవల మేఘాలయలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ, ఇప్పుడు అదే పార్టీతో కలిసి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఎన్పీపీ, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ, ఈ సారి ఎన్నికల్లో మిత్రపక్షాని హ్యాండ్ ఇచ్చి బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది.
సొంతంగా అధికారంలోకి రావాలన్న బీజేపీ దుర్బుద్ధిని పసిగట్టిన ఎన్పీపీ అధినేత, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఆ పార్టీతో బంధాన్ని తెంచుకున్నారు. ఎన్నికల్లో బీజేపీకి రెండే రెండు సీట్లు దక్కాయి. ఎన్నికల ప్రచారంలో ఎన్పీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసింది. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వంలో చేరి మంత్రి పదవిని కూడా తీసుకొన్నది. అత్యంత అవినీతి ప్రభుత్వం అని తిట్టిన అమిత్ షాతో పాటు, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంగ్మా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం అవినీతి ఆరోపణలు చేయటం, అభియోగాలు మోపటం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.