న్యూఢిల్లీ : జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవం (Ram Mandir) సందర్భంగా ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం బీజేపీ నేతలు భేటీ కానున్నారు. ఈ కీలక భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు ప్రతి రాష్ట్ర శాఖ నుంచి ఇద్దరు కార్యవర్గ సభ్యులు హాజరవుతారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రామ మందిర ప్రారంభోత్సవం అంశాన్ని హైలైట్ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేసేందుకు కాషాయ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత చేకూరింది. రామ మందిర ఉద్యమంతో పాటు ఆలయ నిర్మాణంలో బీజేపీ పాత్రను తెలుపుతూ బుక్లెట్ను విడుదల చేయడంతో పాటు లోక్సభ ఎన్నికలకు ముందు కొత్త ఓటర్లతో బూత్ స్ధాయిలో మమేకం కావడంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.
ఎన్నికల ప్రచారంలో ఆలయ నిర్మాణానికి విపక్షాలు అవరోధాలు కల్పించిన తీరును ఎండగట్టాలని కూడా కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు. రామాలయానికి సంబంధించి ఆరెస్సెస్, వీహెచ్పీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు తెలపాలని ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది. ఇక ఆలయ తొలి దశ పూర్తి కావడంతో ఈనెల 22న రాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సహా సాధు సంతుల సమక్షంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.
Read More :
Arvind Kejriwal | జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. పార్టీ కార్యకర్తలతో కేజ్రీవాల్