(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): సరిహద్దు గ్రామాల వివాదంలో మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి కారాలు మిరియాలు నూరుతూ ప్రజలు మభ్యపెడుతున్నాయి. పొరగున బీజేపీ సర్కారే ఉన్నా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గేది లేదంటూ గంభీరపు ప్రకటనలు చేస్తున్నాయి. అయితే త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక బీజేపీకి మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన పెద్ద ఎత్తున ఆర్థిక వనరులను సమకూరుస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు బీజేపీ జాతీయ నేతల నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ రెండు రోజుల కిందట ప్రధాని మోదీని కలిశారు. ఆయన వీరిని హోం మంత్రి అమిత్షాను కలవాల్సిందిగా సూచించారు. వీరిద్దరిపై షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మహారాష్ట్రలో షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలో మూడు ఎన్నికలు జరిగినా మహారాష్ట్ర నుంచి ఒక్క రూపాయి కూడా పార్టీ ఫండ్(ఆర్ధిక సహాయం) అందలేదని అమిత్ షా నిష్టూరంగా మాట్లాడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలకు నిధులు సమకూర్చేందుకు షిండే సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే ఆయన ఈ మేరకు తన అనుయాయులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. మరోవైపు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు కాంట్రాక్టులను వేగవంతంగా మంజూరుచేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. కాంట్రాక్టుల ద్వారా నిధులు సమకూర్చుకోవడం సులవవుతుందని, బీజేపీ జాతీయ నేతలు ఆశించిన మేరకు నిధులు అందించడానికి సాధ్యపడుతుందని తెలిసింది.