న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, ఢిల్లీ మీడియా చీఫ్గా ఉన్న నవీన్కుమార్ జిందాల్పై బీజేపీ అధిష్టానం వేటు వేసింది. నుపూర్ శర్మ పార్టీ నుంచి బహిష్కరించగా.. నవీన్ జిందాల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ లెటర్లో ‘పార్టీ వైఖరికి విరుద్ధంగా మీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. కావున మిమ్మల్ని పార్టీ నుంచి, మీ బాధ్యతల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని’ కేంద్ర క్రమశిక్షణా సంఘం పేర్కొంది.
ఇటీవల నుపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కాన్పూర్లో అల్లర్లు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే నూపుర్ శర్మపై ముంబైతో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. కాగా, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గత శుక్రవారం హింస చెలరేగిన విషయం తెలిసిందే నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పరేడ్ మార్కెట్లోని దుకాణాలను మూసివేయాలని ఓ వర్గం పిలుపునిచ్చింది. యతింఖానా చౌరహా వద్ద మార్కెట్ బంద్ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఘర్షణ చెలరేగగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, పోలీసులపై కొందరు రాళ్లతో దాడికి పాల్పడగా.. 20 మంది పోలీసులతో సహా 40 మంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా వివాదంలో ఉన్న జ్ఞానవాపి మసీదు విషయంలో ఓ టీవీ చర్చలో పాల్గొన్న నూపుర్.. ఇస్లామిక్ మతపరమైన పుస్తకాల్లోని కొన్ని విషయాలను ప్రజలు ఎగతాళి చేస్తున్నారని అనిపిస్తుందన్నారు. మసీదు కాంప్లెక్స్లో కనిపించిన శివలింగాన్ని ఫౌంటెన్గా పిలుస్తూ ముస్లింలు హిందూ విశ్వాసాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు.
BJP cites #NupurSharma‘s views as “contrary to the Party’s position on various matters #BJP pic.twitter.com/651Lv3RG3j
— Paras Bisht (@ParasBisht15) June 5, 2022