Karnataka | బెంగళూరు, మే 1: తొమ్మిది రోజుల్లో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఓటర్లపై బీజేపీ ఉచిత హామీల జల్లు కురిపించింది. ఉచితాలకు (రేవ్డీలకు) తామ వ్యతిరేకమంటూ ఇన్ని రోజులు ప్రకటిస్తూ వస్తున్న బీజేపీ దానికి విరుద్ధంగా రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఉచితాల పేరిట హామీలను కురిపించింది. బీజేపీ మ్యానిఫెస్టో చూస్తే ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి భయం ఎంతగా ఉన్నదో అర్థం అవుతున్నదని విపక్ష పార్టీలు విమర్శించాయి. సోమవారం బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా యూనిఫాం సివిల్కోడ్, ఎన్ఆర్సీ అమలు, బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్ను ప్రకటించింది. ఇటీవల అమూల్ పాల ప్రవేశంపై వివాదం నెలకొన్న క్రమంలో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో కర్ణాటక ప్రభుత్వం తయారు చేస్తున్న నందిని పాలను బీపీఎల్ కుటుంబాలకు ప్రతిరోజు అర లీటరు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించింది. బీజేపీ ప్రజా ప్రణాళిక పేరుతో ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా ఈ మ్యానిఫెస్టో విడుదల చేశారు.
బెంగళూరులో అపార్టుమెంట్లలో నివసించే వారి సుఖవంతమైన జీవనానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఇప్పుడున్న ఓనర్షిప్ యాక్ట్ 1972 ను సవరించి కర్ణాటక రెసిడెంట్స్ వెల్ఫేర్ కన్సల్టేటివ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రతి వార్డులో ఒక లేబరేటరీ ఏర్పాటు, మైసూర్లో దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ పేరిట ఫిల్మ్ సిటీ, కాంగ్రెస్ ప్రకటించిన ఇందిరా క్యాంటీన్లకు పోటీగా ప్రతి వార్డులో ఆహార పంపిణీకి అటల్ ఆహార కేంద్రం ఏర్పాటు, ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ఐదు కేజీల బియ్యానికి తోడు ఐదు కేజీల చిరు ధాన్యాలను రేషన్ దుకాణాలలో పంపిణీ, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు, పట్టణ ప్రాంతాల్లో 5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల ఇండ్ల నిర్మాణం, ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, మైక్రో స్టోరేజ్ సౌకర్యం కోసం 30 వేల కోట్లతో వ్యవసాయ నిధి ఏర్పాటు, కల్యాణ్ కర్ణాటకలో పర్యాటక అభివృద్ధికి రూ.1500 కోట్ల కేటాయింపు వంటి వి చేస్తామని తన మ్యానిఫెస్టోలో తెలిపింది.