న్యూఢిల్లీ, జూలై 30: బాలబాలికల(18 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు) అక్రమ రవాణాలో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ అగ్ర స్థానంలో ఉంది. యూపీలో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి స్థాపించిన కైలాశ్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్(కేఎస్సీఎఫ్), గేమ్స్ 24×7 సంయుక్తంగా బాలల అక్రమ రవాణాపై అధ్యయనం నిర్వహించాయి. ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా ఆదివారం ‘చైల్డ్ ట్రాఫికింగ్ ఇన్ ఇండియా’ పేరుతో నివేదిక విడుదల చేశాయి. దేశంలో తీవ్రస్థాయిలో ఉన్న చిన్నారుల అక్రమ రవాణా సంక్షోభ సమస్యను అధ్యయనంలో ఎత్తిచూపారు.
2016-22 మధ్య ఉత్తరప్రదేశ్లో అధికంగా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్టు అధ్యయనం పేర్కొన్నది. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని తెలిపింది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకంగా ఉన్నదని, కొవిడ్ తర్వాత ఢిల్లీలో చిన్నారుల అక్రమ రవాణా కేసుల్లో 68 శాతం పెరుగుదల కనిపించిందని నివేదిక వెల్లడించింది.
ఇదే 2016-22 వ్యవధిలో రక్షింపబడిన 13,549 మంది చిన్నారుల్లో 80 శాతం మంది 13 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు వారు కాగా, 13 శాతం 9-12 ఏండ్ల పిల్లలు, 2 శాతం మంది తొమ్మిదేండ్ల కంటే చిన్నవారని నివేదిక వెల్లడించింది. చిన్నారుల అక్రమ రవాణా వివిధ వయసుల పిల్లలను ప్రభావితం చేస్తుందని, ఇది విస్తృతమైన సమస్యగా మారుతుందని అభిప్రాయపడింది. వివిధ రంగాలు, పరిశ్రమల్లో చిన్నారులను బాల కార్మికులుగా వాడుకొంటున్న విషయాన్ని కూడా అధ్యయనం ప్రస్తావించింది. హోటళ్లు, దాబాల్లో 15.6 శాతం మంది కార్మికులు చిన్నారులే ఉంటున్నారని, ఆటోమొబైల్ లేదా రవాణా రంగం(13 శాతం), వస్త్ర రంగం(11.18 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. 5-8 ఏండ్ల చిన్నారులు కూడా కాస్మెటిక్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
చిన్నారుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సమగ్రమైన అక్రమ రవాణా వ్యతిరేక చట్టం ఉండాల్సిన అవసరం ఉన్నదని అధ్యయనం నొక్కిచెప్పింది. వివిధ రాష్ర్టాల్లో పిల్లల అక్రమ రవాణా కేసుల్లో గణనీయమైన పెరుగుదల ఉన్నదని నివేదిక పేర్కొన్నది. యూపీలో కొవిడ్ తర్వాత 2021-22 మధ్య కేసుల సంఖ్య 1,214కి పెరిగింది. అదేవిధంగా కర్ణాటకలో ఇదే వ్యవధిలో 6 కేసుల నుంచి 18 రెట్లు పెరిగి 110కి చేరింది.