స్వాతంత్య్రం వచ్చినప్పుడు రూపాయి, డాలర్ విలువ సమానం. ఇప్పుడు రూపాయి విలువ ఎలా పతనమవుతున్నదో..చూశారా?
ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు జూన్ 14, 2013న నరేంద్రమోదీ అన్న మాటలివి అవును. మోదీ చెప్పినట్టు అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ అధఃపాతాళానికి పడిపోతున్న విధానాన్ని దేశప్రజలందరూ ఇప్పుడు గమనిస్తూనే ఉన్నారు. పదేండ్ల బీజేపీపాలనలో డాలర్తో రూపాయి విలువ ఏకంగా 43 శాతం పతనమైంది. ఆసియాలో మరే దేశ కరెన్సీ ఈ స్థాయిలో దిగజారలేదు. రూపాయి విలువ పతనంతో ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నది సామాన్యుడే.
BJP | హైదరాబాద్, మే 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మోదీ సర్కారు తీసుకొన్న అసమర్థ విధానాలతో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం అవుతున్నది. పదేండ్ల వ్యవధిలో భారత కరెన్సీ విలువ ఏకంగా 43 శాతం పతనమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతకంతకూ క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా ప్రస్తుతం దేశానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల బతుకు ఆగమాగం కానున్నది.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతే ముందుగా చమురు ధరలపై ఆ ప్రభావం పడుతుంది. దేశీయ చమురు అవసరాలను 80 శాతం మేర దిగుమతులే సంతృప్తిపరుస్తుండటం దీనికి కారణం. చమురు చెల్లింపులు అంతర్జాతీయ కరెన్సీ అమెరికన్ డాలర్ల ప్రాతిపదికన చేస్తుండటంతో ఎక్కువ మొత్తంలో డాలర్లను ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఒకవైపు రిజర్వ్బ్యాంక్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు కరిగిపోవడంతో పాటు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెరుగొచ్చు. ఇంధన ధరలు పెరిగితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెంచుతారు. దేశీయంగా ఇంధన ధరల పెరుగుదలతో విమాన టికెట్ల రేట్లు కూడా పెరుగుతాయి.
ఇంధనం ధరలు పెరుగడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఆ ప్రభావం కూరగాయలు, పాలు, పప్పు, ఉప్పు ఇలా మార్కెట్లో ప్రతీ వస్తువుపై పడుతుంది. ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొంటుంది. అంతిమంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయి.
రూపాయి క్షీణత.. బ్యాంకు రుణాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. పెరిగే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్లను సవరిస్తుంది. దీంతో గృహ, కారు రుణాలను తీసుకొన్న సామాన్యులపై ఈఎంఐల భారం పెరుగుతుంది.
మొబైల్ ఫోన్, టీవీ సెట్లు, కంప్యూటర్ల తయారీకి అవసరమైన ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు 80 శాతం మేర విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. రూపాయి విలువ పడిపోతే వీటి ధరలు కూడా పెరుగుతాయి.
70 శాతం మేర దేశీయ విద్యుత్తు అవసరాలను బొగ్గు తీరుస్తున్నది. భారత్ పెద్దయెత్తున విదేశాల నుంచి బొగ్గు, కుకింగ్ కోల్ను దిగుమతి చేసుకొంటున్నది. రూపాయి క్షీణతతో ఇది భారంగా మారొచ్చు. ఫలితంగా విద్యుత్తు చార్జీలు కూడా పెరుగొచ్చు.
రూపాయి పతనంతో విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజుల కోసం అధికంగా చెల్లించాల్సి రావొచ్చు. వైద్య చికిత్సల కోసం, పర్యటనల కోసం విదేశాలకు వెళ్లే వారి బడ్జెట్ పరిమాణం కూడా అనూహ్యంగా పెరిగిపోతుంది.
కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు కొలువుదీరిన దగ్గర్నుంచి రూపాయి మారకం విలువ భారీగా ఆవిరైపోయింది. 2014లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం రూ. 58 వద్ద ఉంటే ప్రస్తుతం రూ. 83కు చేరుకొన్నది. దీంతో పదేండ్లలో కరెన్సీ విలువ రూ. 25 మేర పతనమైంది.