గువాహటి, మే 4: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్సాంలో వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. హిమంత బిశ్వశర్మ పాలనకు అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. 126 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 102 సీట్లతో ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించింది. ఇక్కడ బీజేపీ 81 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించగా, దాని మిత్రపక్షాలైన బోడో పీపుల్స్ ఫ్రంట్, అస్సాం గణపరిషత్ చెరో 10 సీట్లను దక్కించుకున్నాయి. అస్సాం సీఎం బిశ్వ శర్మ జలుకబరిలో విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి అధికార పార్టీ జోరుకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేక పోయింది.
కాంగ్రెస్ 21, ఏఐయూడీఎఫ్ 2, ఇతరులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ కూడా పరాజయం పాలయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అస్సాం పోల్ ఇన్చార్జి భన్వర్ జితేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. అస్సాంలో 16 సీట్లలో తొలిసారిగా పోటీ చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా తన ఖాతాను తెరవడంలో విఫలమైంది. ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ బిన్నకండి నియోజకవర్గంలో విజయం సాధించారు.
అస్సాం ఎన్నికల్లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు ఓటమిపాలయ్యారు. తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్, హితేశ్వర్ సైకియా కుమారుడు దేవవ్రత సైకియా, భూమిందర్ బర్మన్ కుమారుడు దిగంత బర్మన్ పరాజయం పాలయ్యారు.
