న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శనివారం తొలిసారిగా భేటీ కానున్నది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రోడ్మ్యాప్, రాజకీయ పార్టీలు, సంబంధిత నిపుణులతో చర్చలు, ఇతర విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 23న తొలి భేటీ నిర్వహించే విషయాన్ని కోవింద్ ఇటీవల తన ఒడిశా పర్యటనలో మీడియాకు తెలిపారు. లోక్సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై పరిశీలన చేసేందుకు కేంద్రం ఎనిమిది మంది సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో కోవింద్తో పాటు కేంద్ర హోంమంత్రి, గులాం నబీ ఆజాద్ తదితరులు ఉన్నారు.