న్యూఢిల్లీ, మార్చి 1: ఎనిమిదేండ్లుగా నిజాయితీగా పనిచేస్తున్న తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అవి అబద్ధమని భగవంతుడికి, తనకు తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడంతో మంగళవారం ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో ఆయన బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తనపై అవినీతి ఆరోపణలు.. అరవింద్ కేజ్రీవాల్ అంటే భయపడుతున్న పిరికివాళ్లు, బలహీనులు చేసిన కుట్ర అని పేర్కొన్నారు. వాళ్ల టార్గెట్ తాను కాదని, కేజ్రీవాలేనని అన్నారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలే కాకుండా యావత్తు దేశమంతా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే నాయకుడిగా కేజ్రీవాల్ను చూస్తున్నందునే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
బీజేపీలో చేరితే రేపే విడుదల: కేజ్రీవాల్
ఢిల్లీలో తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకొనేందుకు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ను అరెస్టు చేయించారని బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బుధవారం సాయంత్రం ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్లో తమ పార్టీ గెలిచిన తర్వాత బీజేపీ తమను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నదని పేర్కొన్నారు. ఇందుకు మద్యం పాలసీని ఒక సాకుగా చేసుకుంటున్నారని తెలిపారు. ఒకవేళ మనీశ్ సిసోడియా ఇవాళ బీజేపీలో చేరితే రేపే విడుదల అవుతారని వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకోవాలని ప్రధాని మోదీ చూస్తున్నారని, కానీ తాము రెట్టింపు వేగంతో పని చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగా అతీశి, సౌరభ్ భరద్వాజ్ను క్యాబినెట్లోకి తీసుకోనున్నట్టు ప్రకటించారు. కాగా, సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామాతో ఖాళీ అయిన శాఖలను మంత్రులు కైలాశ్ గెహ్లాట్, రాజ్కుమార్ ఆనంద్కు అప్పగించారు. ఈ మేరకు కేజ్రీవాల్ పంపిన సిఫారసులకు ఎల్జీ ఆమోదం తెలిపారు.