సంతిపుర్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు విపక్ష నేతల్ని అందర్నీ బీజేపీ జైలుకు పంపుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శించారు. ఓ భూకుంభకోణం కేసులో బుధవారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశంపై ఆమె స్పందించారు. నదియా జిల్లాలోని సంతిపుర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఒకవేళ తనను కూడా బీజేపీ జైలుకు పంపిస్తే, తాను జైలు నుంచి మళ్లీ తిరిగి వస్తానని అన్నారు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రతి ఒక విపక్ష నేతను జైలుకు పంపుతోందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టాలని తమకు ఉందని, కానీ ఆ పార్టీ తమ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సీఎం దీదీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీపీఎంతో చేతులు కలిపిందని, ఇది బీజేపీ విజయానికి తోడ్పడుతుందని ఆమె ఆరోపించారు.