భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Madhya Pradesh Elections) విజయంపై కమలనాధుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలం సీఎంగా వ్యవహరించిన శివరాజ్ సింగ్ చౌహాన్కు బీజేపీ మోకాలడ్డుతోందని, సోమవారం విడుదల చేసిన రెండో జాబితాలోనూ ఆయన బరిలో నిలిచే నియోజకవర్గాన్ని వెల్లడించకపోవడమే ఇందుకు నిదర్శమని చెబుతున్నారు. ఇక తాము బలహీనంగా ఉన్న సీట్లలో సీనియర్ నేతలను, ఎంపీలను బరిలో దించేందుకు కాషాయ పార్టీ ప్రయత్నాలు చూస్తుంటే శివరాజ్ చౌహాన్కు పార్టీ అధినాయకత్వం చెక్ పెడుతున్నదని భావిస్తున్నారు.
సీనియర్లు బరిలో దిగితే సీఎం రేసులో శివరాజ్ చౌహాన్కు వారు పోటీ ఇస్తారనే అంచనాలు వెల్లడవుతున్నాయి. ఎన్నికల్లో విజయావకాశాలపై ఆశలు సన్నగిల్లడంతోనే పార్టీ ఏకంగా ముగ్గురు కేంద్ర మంత్రులతో సహా ఏడుగురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గీయ కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగన్ సింగ్ కులస్తే సైతం అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు.
ఇక కాషాయ పార్టీ ప్రయత్నాలు ఆ పార్టీ దీనస్ధితికి అద్దం పడుతున్నాయని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం కమల్ నాధ్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఓటమిని అంగీకరించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భయం వెంటాడుతుండటంతోనే రాష్ట్రంలో మునుగుతున్న నావను కాపాడుకునేందుకు అగ్ర నాయకత్వాన్ని ఎన్నికల బరిలోకి బీజేపీ దింపుతోందని సీనియర్ కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జీవాలా వ్యాఖ్యానించారు.
Read More :
Parineeti-Raghav Chadha | పెళ్లిలో పరిణీతి-రాఘవ్ డ్యాన్స్.. ఫన్నీ వీడియో