BJP | ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ను ఉపసంహరించుకోవాలని తనపై బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ అభయ్ జైన్ సోమవారం ఆరోపించారు. ఆయన సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, ధన బలం, కండ బలంతో కూడిన రాజకీయాలు లేని ఇండోర్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు.
ఎమ్మెల్యేలు కైలాశ్ విజయవర్ఘీయ, రమేశ్ మెండోలా సహా నలుగురు బీజేపీ నేతలు ఏప్రిల్ 27న తనను కలిశారని చెప్పారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని చూడలేకపోతున్నామని, తిరిగి ప్రచారక్గా పని చేయాలని కోరారని చెప్పారు. తాను అందుకు తిరస్కరించానన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి గోవింద్ మలు స్పందిస్తూ ప్రచారం కోసమే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆరెస్సెస్ మాజీ ప్రచారక్లు ఏర్పాటు చేసిన జనహిత్ పార్టీకి గుర్తింపు లభించకపోవడంతో, అభయ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.