(స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ) : దక్షిణాదిలోనూ పాగా వేయడానికి బీజేపీ.. కేంద్రంలో అధికారాన్ని అడ్డగోలుగా వాడుకొంటున్నదని విమర్శలు వస్తున్నాయి. దక్షిణ రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీలు, నేతలు.. వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. 2024 ఎన్నికల నాటికి దక్షిణాదిలో పట్టు సాధించడమే లక్ష్యంగా కేంద్ర పెద్దలు పూర్తిగా దృష్టిసారించి దర్యాప్తు సంస్థలకు మార్గదర్శకం చేస్తున్నారనడానికి తెలంగాణ విమోచన దినం పేరిట కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దర్యాప్తు సంస్థల అధికారులతో సమావేశం కావడమే నిదర్శనమని చెప్తున్నారు. ఇది జరిగి వారం తిరక్కుండానే ఐటీ అధికారుల మూకుమ్మడి బదిలీలు జరిగాయి. రాజకీయ ప్రత్యర్థులపై తాము ఆశించిన మేరకు దాడులు జరపడం లేదనే ఈ బదిలీలు జరిగాయని ప్రచారం జరుగుతున్నది.
భారత్ జోడో సరిగ్గా ప్రవేశించడానికి ముందు..
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్పై గతంలో ఆర్థిక అవకతవకల అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. తాజాగా సోమవారం విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసు ఇచ్చింది. సరిగ్గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ప్రవేశించడానికి ముందు నోటీసు జారీ చేయడం ఆంతర్యం.. శివకుమార్ను ఇరుకున పెట్టడం ద్వారా కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టడమే.
తమిళనాడు, కేరళలోనూ ఇలాగే…
దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల అధినేతలను ఏమీ చేయలేకపోవడంతో వారి సన్నిహితులను కేంద్రం లక్ష్యంగా చేసుకొంటున్నది. తమిళనాడు సీఎం స్టాలిన్ మేనల్లుడు శబరీషన్, కేరళ సీఎం విజయన్కు సన్నిహితంగా ఉండే ఐఏఎస్లను గోల్డ్ స్మగ్లింగ్లో ఇరికించడానికి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితులను అప్రూవర్లుగా మార్చుకొని సంబంధం లేనివారిని కూడా ఇరికించడానికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ముక్త్ భారత్ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలను, పార్టీలను ఏకం చేస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు.