BJP | లోకసభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మూడోసారీ కేంద్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. టికెట్ల కేటాయింపులో సిట్టింగ్ ఎంపీలకు కాకుండా గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ప్రతి లోక్సభ సీటుకు సంబంధించిన అభ్యర్థిని ఎంపిక చేసే ముందు ఆ అభ్యర్థి గెలుపు అవకాశాలను బేరీజు వేయనున్నది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనుంది.
ముందుగా బీజేపీ బలంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపీ సీనియర్ నాయకుడు చెప్పారు. సిట్టింగ్ ఎంపీలకు బదులుగా గెలుపే ప్రధాన అంశంగా ఈ టికెట్ల కేటాయింపు జరగనుందని వెల్లడించారు. మధ్యప్రదేశ్లో 28 సిట్టింగ్ బీజేపీ ఎంపీలు ఉండగా వారిలో 20 మందికి పైగా అభ్యర్థులను మార్చనున్నారని ఆయన తెలిపారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ఏడుగురు సిట్టింగ్ ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్ధులుగా బరిలోకి దింపింది. అప్పుడు ఎంపీలకు ప్రాధాన్యం ఇవ్వగా.. లోక్సభ ఎన్నికల్లో మాత్రం యువతకు ఇంపార్టెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ గెలుపు ఖాయమని అనుకున్న సీట్లలో ఎక్కువ శాతం యువకులకు, కొత్త వారికి టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. బీజేపీ రెండో స్థానంలో ఉన్న చోట అభ్యర్థుల చరిష్మా కూడా అవసరం అవుతుందని.. అలాంటి చోట్లలో అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.