BJP | న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశలు పెట్టుకున్న నాయకులకు బ్యూరోక్రాట్లు గండికొడుతున్నారు. నిన్న..మొన్న కాషాయ కండువా కప్పుకున్న మాజీ అధికారులు టికెట్లు ఎగరేసుకుపోతున్నారు. పార్టీ అధిష్ఠానం తమను కాదని బ్యూరోక్రాట్ల పట్ల మొగ్గు చూపడం బీజేపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా మాజీ ఐఏఎస్/ఐపీఎస్లు బీజేపీలో చేరారు. తమకు మొండిచేయి చూపుతూ అధికారులను అందలమెక్కించడాన్ని బీజేపీ నాయకులు అవమానంగా భావిస్తున్నారు.
వీరంతా మూకుమ్మడిగా ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ను, కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ను కలిసి నిరసన వ్యక్తం చేశారు. అధికారులుగా ఉన్న సమయంలో వీరు ఎన్నడూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడలేదని, ఇప్పుడు ఎన్నికల ముంగిట టికెట్ల కోసం బారులు దీరుతున్నారని బీజేపీ ఎస్టీ మోర్చా మాజీ అధ్యక్షుడు జితేంద్ర మీనా మండిపడ్డారు.
ఇంతకాలం అధికారాన్ని అనుభవించి ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందడం కోసం టికెట్లు ఆశిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని అధికారంలోకి తెచ్చింది బీజేపీ కార్యకర్తలు తప్ప బ్యూరోక్రాట్లు కాదని బీజేపీ రాజస్థాన్ ఉపాధ్యక్షుడు పేర్కొన్నారు. రాజస్థాన్లో డజనుమందికి పైగా మాజీ ఐఏఎస్లు టికెట్లు ఆశిస్తుండగా.. వారికి అవకాశం కల్పిస్తే పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా మరో పార్టీలోకి మారడం ఖాయమని కమలనాథులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది తమ పదవీ కాలం ముగిసిన తరువాత బీజేపీలో చేరగా, కొందరు ఎన్నికల ముంగిట తమ పదవులకు రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకుంటున్నారు.
ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో పలు కీలక మంత్రి పదవులలో ఉన్నవారు మాజీ ఐఏఎస్లే కావడం గమనార్హం. మంత్రి పదవుల్లోనే కాకుండా పార్టీలో పదవులను కూడా వీరు ఆక్రమిస్తుండటం విశేషం. తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఐపీఎస్ అధికారి కే అన్నామళై నియమితులు కావడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. అంతకుముందు ఓపీ చౌదరి (ఐఏఎస్)ని ఛత్తీస్గఢ్లో పార్టీ ప్రధానకార్యదర్శిగా, ఏకే శర్మ (ఐఏఎస్)ను ఉత్తరప్రదేశ్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. పలువురు ఐఏఎస్/ఐపీఎస్లు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థులుగా పోటీచేశారు.
కేంద్రంలో సివిల్ సర్వెంట్ల ప్రభావం నానాటికీ పెచ్చుమీరుతున్నదని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ మంత్రి విమర్శించారు. ఈ ఏడాది జూలైలో జరిగిన క్యాబినెట్ భేటీలో ఐఏఎస్ అధికారులే ప్రజెంటేషన్ ఇచ్చారని ఉదహరించారు. మా కార్యక్రమాలపై పీఎంఓ నిఘా వేస్తుంది. మేం ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలో పీఎంఓలోని అధికారులే నిర్ణయిస్తారు. బ్యూరోక్రాట్లకు ఆదేశాలను అమలు చేయడమే తెలుసు, వారికి ఎదురుచెప్పడం రాదు.. అందుకే మోదీ వారినే ఎక్కువగా నమ్ముతారు. ప్రజలకు హాని చేసే నిర్ణయాలను అమలు చేయడానికి మేమైతే వెనుకడుగు వేస్తాం.. అందుకే ఆయన మమ్మల్ని విశ్వసించరు’ అంటూ కుండబద్దలు కొట్టారు.