ముంబై: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై శివసేన పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. నటుడు సోనూసూద్పై ఐటీ దాడులు చేయించడాన్ని శివసేన తీవ్రంగా తప్పుపట్టింది. లాక్డౌన్ సమయంలో సోనూసూద్ పనితీరుపై ప్రశంసలు కురిపించిన బీజేపీ.. ఇప్పుడు అతడిని పన్ను ఎగవేతదారుగా చూస్తున్నదని మండిపడింది. సామాజిక సేవలో చురుగ్గా ఉంటున్న సోనూసూద్తో చేయి కలిపేందుకు ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అతడిపై ఐటీ దాడులు చేయిస్తున్నదని ఆరోపించింది.
ఈ మేరకు శివసేన మౌత్పీస్ అయిన సామ్నాలో పెద్ద సంపాదకీయమే రాశారు. సోనూసూద్ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చాలా నీచంగా ఉన్నదని ఆ వ్యాసంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక మంది సభ్యులను కలిగి ఉండాలని ఉబలాటపడే పార్టీలకు విశాల హృదయం కూడా ఉండాలని సామ్నా హితబోధ చేసింది. బుధవారం ముంబై సహా పలు ఏరియాల్లోని ఆయన ఆస్తులపై ఐటీ అధికారులు పన్ను ఎగవేత పేరుతో సోదాలు చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులపై కేసులు పెట్టి వేధించడం, గవర్నర్పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో అధికార కూటమి సభ్యులను సతాయించడం, సోనూసూద్ ఆస్తులపై ఐటీ దాడులు చేయించడం లాంటివన్నీ బీజేపీ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు.