లక్నో: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తు్న్నది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రముఖులను ఎవ్వరినీ మహమ్మారి వదలట్లేదు. తాజాగా బీజేపీ ఎంపీ వరూణ్ గాంధీ కరోనా బారినపడ్డారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు రోజులుగా ఆయన పిలిబిత్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడ్డారు. తనకు తీవ్రమైన లక్షణాలు ఉన్నాయని స్వయంగా ప్రకటించారు.
After being in Pilibhit for 3 days, I have tested positive for COVID with fairly strong symptoms.
— Varun Gandhi (@varungandhi80) January 9, 2022
We are now in the middle of a third wave and an election campaign.
The Election Commission should extend precautionary doses to candidates and political workers as well.
ప్రస్తుతం మనం కరోనా మూడో వేవ్, ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నామని చెప్పారు. అందువల్ల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలకు ఎన్నికల కమిషన్ ముందస్తుగా వ్యాక్సిన్ డోసులు ఇప్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్తోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాలోని మొత్తం 690 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు.
కాగా, తాను కరోనా నుంచి కోలుకున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. ఈ నెల 4న సీఎం కేజ్రీవాల్కు కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆయన అప్పటినుంచి హోం ఐసోలేషన్లో ఉన్నారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని చెప్పారు. అయితే తాజాగా తాను కరోనా నుంచి కోలుకున్నాని స్వయంగా ప్రకటించారు.