న్యూఢివల్లీ, నవంబర్ 8: భారత సరిహద్దు ప్రాంతాల్లో చైనా దురాగతాలు పెచ్చుమీరుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రకరకాల నిర్మాణాలు చేపట్టింది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించింది. ఈ విషయాలను పలు సందర్భాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు తెలియజేయడమే కాదు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. తాజాగా అమెరికా రక్షణ శాఖ కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. సీఎం వ్యాఖ్యలను పలువురు సమర్థించారు. చైనా దురాక్రమణను పట్టించుకోని కేంద్రప్రభుత్వ తీరును బీజేపీకే చెందిన ఎంపీ సుబ్రమణ్యస్వామి రెండేండ్లుగా ఎండగడుతున్న విషయాన్ని తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ హైదరాబాద్కు చెందిన తిమ్మవఝ్ఝల పవన్ ట్విట్టర్లో ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వం ఈరోజుకీ చైనాను దురాక్రమణదారు అనడం లేదని, శత్రువు ఎవరో చెప్పకుండా ఎవరైనా ఎలా పోరాడుతారని ప్రశ్నించారు. ఈ ట్వీట్ను ఆంగ్లపత్రిక ‘ది హిందూ’కు చెందిన ఫొటో జర్నలిస్ట్ పీవీ శివకుమార్ రీట్వీట్ చేశారు. చైనా దురాక్రమణకు పాల్పడుతున్నదన్న సుబ్రమణ్యస్వామి హెచ్చరికను పట్టించుకోవాలన్నారు. పవన్ ట్వీట్లను సుబ్రమణ్యస్వామి రీట్వీట్ చేసి ఈ అంశంలో తనవైఖరి మారలేదని నిరూపించు కున్నారు.
ఉష్ట్రపక్షిలా మోదీ సర్కారు
చైనా దురాక్రమణపై, మన సైనికుల మీద ఆ దేశ సైన్యం చేస్తున్న ఆగడాలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఇసుకలో తలదూర్చి ఉండే ఉష్ట్రపక్షిలాగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనాతో పొంచి ఉన్న ముప్పు గురించి మోదీ సర్కార్ను సుబ్రమణ్యస్వామి రెండే ండ్లుగా హెచ్చరిస్తూ వస్తున్నారు. చైనా దుందుడుకు పోకడలపై సీఎం కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశమవుతున్నాయి.
‘హృదయం లేని మోదీ ప్రభుత్వం’!
గతేడాది గల్వాన్ ఘర్షణపై ప్రధాని మోదీ అఖిలపక్షంలో మాట్లాడుతూ.. భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని ప్రకటించారు. దీనిపై సుబ్రమణ్యస్వామి మోదీ సూటిగా నిలదీశారు. ‘చైనా మన భూభాగంలోకి చొచ్చుకురాకపోయి ఉంటే.. ఆ దేశంతో 18సార్లు చర్చలెందుకు జరిపారు’ అని ప్రశ్నించారు. గల్వాన్ ఘర్షణ అనంతరం కొందరు భారతీయ సైనికుల్ని చైనా నిర్బంధించి తీవ్రంగా హింసించిందని పేర్కొంటూ ఒక వీడియో ఇటీవల బయటకువచ్చింది. దీనిపై కేంద్రం మాత్రం స్పష్టతనివ్వలేదు. దీని మీదా సుబ్రమణ్యస్వామి స్పందించారు. ‘ఈ వీడియో గనుక నిజమే అయితే.. ఇది అత్యంత భయానకం. మోదీ ప్రభుత్వానికి హృదయం లేదని అర్థమవుతుంది. పుల్వామాలో మరణించిన జవాన్లకు దేశవ్యాప్తంగా నివాళి అర్పించాంగానీ.. గల్వాన్లో యుద్ధంలో అమరులైన సైనికులకు మోదీ ప్రభుత్వం ప్రభుత్వపరంగా నివాళి అర్పించే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టలేదు?’ అని ప్రశ్నించారు. గల్వాన్ ఘటనను మోదీ ప్రభుత్వం కావాలనే తక్కువ చేసి చూపిందని, దానిపై దేశప్రజలు దృష్టి సారిస్తే చైనా దురాక్రమణ, తమ చేతగానితనం బయటపడుతాయనే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరించిందన్న విమర్శలున్నాయి.