బెంగళూరు, నవంబర్ 14: దళితులకు బీజేపీలో చోటు ఉండదని.. ఒకవేళ ఒక్కరో ఇద్దరో ఉన్నా వాళ్లు పార్టీలో ఎప్పటికీ ఎదగరని మరోసారి రుజువైంది. సాక్షాత్తూ బీజేపీకి చెందిన ఎంపీనే ఈ విషయం వెల్లడించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ జాగజినాగి మాట్లాడుతూ ‘నీవు దళితుడివి అయితే బీజేపీలో ఎప్పటికీ ఎదగలేవు. అసలు ఎదిగే అవకాశమే రాదు. బీజేపీకి దళితులన్నా, వాళ్ల ఎదుగుదల అన్నా అస్సలు నచ్చదు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ విధానం మరోసారి బయటపడింది.
ఇందుకు నిదర్శనమే కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా మాజీ సీఎం యెడియూరప్ప కుమారుడు విజయేంద్రను నియమించడం’ అని పేర్కొన్నారు. బీజేపీలో ధనవంతులదే రాజ్యమని, వీరికి మద్దతు తెలుపడానికి చాలా మంది ముందుకు వస్తుంటారని రమేశ్ చెప్పారు. అదే పేదవాడైన దళితుడికి మద్దతు తెలుపడానికి ఒక్క నేత కూడా ముందుకురారని పేర్కొన్నారు. బీజేపీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేకత ఉందన్నారు.తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా అధిష్ఠానం నియమించిందని, ఇంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదని పేర్కొన్నారు.