న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ మెంబర్ బిల్లును బీజేపీ ఎంపీ కిరోడిలాల్ మీనా శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ బిల్లు వైవిధ్యమైన భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తుందని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ బిల్లు ప్రవేశపెట్టాలా? వద్దా? అన్నదానిపై ఓటింగ్ నిర్వహించారు. 63 మంది అనుకూలంగా, 23 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో మెజారిటీ ప్రకారం బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జాతీయ దర్యాప్తు, పరిశోధన కమిటీకి బిల్లును రూపొందించే బాధ్యత అప్పగించాలని, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేలా చూడాలని కిరోడి లాల్ విన్నవించారు.
గతంలోనూ ప్రయత్నాలు
గతంలోనూ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కేంద్రం చూసింది. కానీ, కుదరలేదు. దాంతో పూర్తి మెజారిటీతో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తెరపైకి తీసుకొచ్చింది.
ఉమ్మడి పౌరస్మృతి అంటే..
మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుందన్న మాట. అంటే.. పెండ్లిళ్లు, విడాకులు, వారసత్వం, దత్తత, జీవన భృతి (భరణం, మనోవర్తి, ఇతరత్రా) మొదలైన అన్ని అంశాల్లో కుల, మత, వర్గాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే చట్టం ఉంటుంది.
ఇప్పటి వరకు ఎలా ఉన్నది?
ఇప్పటి వరకు మతపరమైన చట్టాలున్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి.
భారత్ను వీడుతున్నారు!
ఐదేండ్లలో పౌరసత్వం వదులుకున్న 1,83,741 మంది
భారత్ను శాశ్వతంగా వీడుతున్నవారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. గత ఐదేండ్లలో మొత్తం 1,83,741 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. 2017లో భారత పౌరసత్వాన్ని వదులుకున్నవారి సంఖ్య 1,33,049గా ఉంది. ఈ మేరకు విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్ శుక్రవారం పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అలాగే, బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి భారత పౌరసత్వం తీసుకొన్న వారి సంఖ్యను కూడా వెల్లడించారు. 2015లో 93 మంది, 2016లో 153, 2017లో 175, 2018లో 129, 2019లో 113, 2020లో 27, 2021లో 42, 2022లో 60 మంది పౌరసత్వం స్వీకరించినట్టు తెలిపారు.