భోపాల్ : బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా నీటి వనరుల ప్రాధాన్యతను వివరించే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని రెవాలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రజలు మద్యం సేవించినా, పొగాకు నమిలినా నీటి ప్రాధాన్యతను అర్ధం చేసుకోవాలని అన్నారు.
నీటి సంరక్షణ విషయంలో రాజీ పడరాదని చెప్పుకొచ్చారు. భూములు జలం లేక తడారిపోతున్నాయి..భూమిని మనం కాపాడాలి..మద్యం సేవించండి..పొగాకు నమలండి..మత్తు పదార్ధాలను పీల్చండి అయితే నీటి ప్రాధాన్యతను మాత్రం అర్ధం చేసుకోండని ఆయన వ్యాఖ్యానించారు. చెరువులు, కుంటలు సహా పలు నీటివనరులు ఎండిపోతున్నాయని, బోరుబావులు తవ్వుతూ ప్రజలు భూగర్భ జలాలను ఖాళీ చేస్తున్నారని అన్నారు.
భూగర్భ జలాలను పెంచి నీటి సంరక్షణపై పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. మీరు నీరు ఎక్కువగా వాడుకుని గ్రౌండ్ వాటర్ను తోడేస్తే రాబోయే తరాలకు నీరు ఉండదని హెచ్చరించారు. మీ డబ్బును మీకు తోచినచోట ఖర్చు చేసుకోండి..అయితే జల సంరక్షణపై ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మతపరమైన కార్యక్రమాలు, వ్యక్తిగత విషయాలపై ప్రజలు ఖర్చు చేస్తారని, అయితే అందులో కొంత పర్యావరణ పరిరక్షణకూ వెచ్చించాలని కోరారు.