కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సూచిస్తోందని మండిపడ్డారు. జగ్లాద్ బజార్ లో అల్లర్లకు వ్యతిరేకంగా వ్యాపారులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.
అల్లరి మూకకు రాష్ట్ర పాలకులు వత్తాసు పలకడంతో పోలీసులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. జగ్లాద్ బజార్ లోని గోష్పార రోడ్డులో అల్లరిమూకలు ఏడు దుకాణాలను లూటీ చేశారని తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో 150 మంది పోలీసులు మోహరించినా పరిసర ప్రాంతాల్లో ఇంకా బాంబులు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జిహాదీల మద్దతుతో టీఎంసీ సర్కార్ కొలువుదీరినందున వారిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని స్వయంగా పోలీసులే తనతో చెప్పారని బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ పేర్కొన్నారు.