న్యూఢిల్లీ: భారత కుస్తీ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ చాలా ఏండ్లు గా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఒలింపిక్ పతక విజేత వినేశ్ ఫోగట్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ విషయంలో ప్రధాని, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్, సరిత మోర్, సంగీతా ఫోగట్ సహా 30 మంది రెజ్లర్లు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వినేశ్ ఫోగట్ మాట్లాడుతూ లక్నోలోని జాతీయ శిబిరంలో కొందరు కోచ్లు కూడా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తాను వ్యక్తిగతంగా లైంగిక వేధింపులకు గురి కాలేదని, కానీ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు, ఆయనతో చనువుగా ఉండే అధికారుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని వెల్లడించారు. ‘10-12 మంది రెజ్లర్లు తామెదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నాకు చెప్పారు. మేం ప్రధాని, హోం మంత్రిని కలిసే అవకాశం వస్తే తప్పకుండా బాధితుల పేర్లు వెల్లడిస్తాను.’ అని ఆమె అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ ఏకపక్ష నిర్ణయాలతో నడుస్తున్నదని, అధ్యక్షుడిని తొలగించేంత వరకు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేమని స్టార్ రెజ్లర్ భజ్రంగ్ పునియా అన్నారు. అధ్యక్షుడిని తొలగించేంత వరకు ధర్నా కొనసాగిస్తామన్నారు. బ్రిజ్ భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.