న్యూఢిల్లీ : పార్లమెంట్లో శుక్రవారం చంద్రయాన్-3 మిషన్ సక్సెస్పై చర్చ సంద్భంగా బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ (BJP MP) రమేష్ బిధురి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డానిష్ అలీని ఉగ్రవాది అంటూ సంభోదించారు. రమేష్ బిధురి వ్యాఖ్యలపై విపక్షం భగ్గుమంది. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. బీఎస్పీ ఎంపీ అలీపై బిధురి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ లోక్సభలో విచారం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలను తాను వినలేదని, అయితే అవి విపక్ష సభ్యులకు ఇబ్బంది కలిగిస్తే వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ సభ్యుడిపై చర్యలు చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుపట్టారు. బిధురిపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను డిమాండ్ చేశారు.
రమేష్ బిదురిపై ఏం చర్యలు చేపడతారో వెల్లడించాలని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ముస్లింలు, ఓబీసీలను అవమానించడం బీజేపీ సంస్కృతిలో భాగమని ఆమె ఆరోపించారు. బిధురి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విస్మయం వ్యక్తం చేశారు. బిధురిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కోరారు.
Read More :