బెంగళూరు, మార్చి 27: ఇంట్లో గుట్టలుగా అక్రమ నగదు దొరికినా 25 రోజులుగా బయట యథేచ్ఛగా తిరుగుతున్న బీజేపీ ఎమ్మెల్యే మండల్ విరూపాక్షప్పను ఎట్టకేలకు సోమవారం కర్ణాటక లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టి వేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన నియోజకవర్గమైన చెన్నగిరి నుంచి బెంగళూరు వెళ్తుండగా అరెస్టు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్స్ లిమిటెడ్(మైసూర్ సాండల్ సబ్బులు ఉత్పత్తి చేసే సంస్థ)కు విరూపాక్షప్ప చైర్మన్గా పనిచేశారు.
ఈ సంస్థకు ముడి సరుకులు సరఫరా చేసిన ఓ కాంట్రాక్టరుకు బిల్లు మంజూరు చేయడానికి రూ.81 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా రూ.40 లక్షలు తీసుకుంటూ విరూపాక్షప్ప కొడుకు, కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి ప్రశాంత్ మార్చి 2న లోకాయుక్త పోలీసులకు దొరికిపోయాడు. అనంతరం విరూపాక్షప్ప ఇంట్లో సోదాలు జరపగా రూ.8.23 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విరూపాక్షప్పకు ముందస్తు బెయిల్ మంజూరైంది. తాజాగా హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.