లక్నో: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపవుతున్నారు. నిన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో మంత్రి, ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని వీడారు. రాజీనామా చేసి ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఆయనతోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వారిలో బిధునా నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్ షక్యా కూడా ఉన్నారు.
అయితే తన తండ్రిని ఎవరో ఎత్తుకెళ్లారని వినయ్ షక్యా కుమార్తె నిన్న ప్రకటించారు. తాజాగా ఆ ప్రకటనను ఎమ్మెల్యే వినయ్ ఖండించారు. తాను మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వెంట ఉన్నానని, తర్వలోనే సమాజ్వాదీ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. ఆయనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతుండటంతో కాషాయదళంలో కలవరం మొదలైంది.
కాగా, మరో 13 మంది ఎమ్మెల్యేలు త్వరలో ఎస్పీ గూటికి చేరుతున్నారని ఎన్సీపీ అధినేత శరద్పవార్ ప్రకటించారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో తాము ఎస్పీతో కలిసి పనిచేస్తామని చెప్పారు.