బెళగావి, అక్టోబర్ 30: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయినట్టే కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేశ్ జార్ఖిహోళి వ్యాఖ్యానించారు. బెళగావిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ త్వరలో అధికారం కోల్పోతారని అన్నారు. ఒక రాత్రిలో ఏదైనా మారిపోతుందని, హైకోర్టులో తగిలే ఎదురు దెబ్బలతో శివకుమార్ మాజీ మంత్రి అయిపోతాడంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆపరేషన్ కమలం సాధ్యం కాదంటూనే.. మహారాష్ట్రలో జరిగినట్లుగా జరిగితే, కర్ణాటకలో కూడా ప్రభుత్వం పడిపోతుందని, శివకుమార్ వల్లనే అది జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళ్లు పట్టుకొని, అధికారంలో ఉన్నప్పుడు జుట్టు పట్టుకొనే వ్యవహారశైలి డీకే శివకుమార్ది అని విమర్శించారు. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ ప్రముఖ నేతల్లో రమేశ్ జార్ఖిహోళి కూడా ఒకరనే ఆరోపణలు ఉన్నాయి. శివకుమార్ పెద్ద మనిషేం కాదని, సీడీల పేరుతో ప్రతి ఒక్కరినీ బ్లాక్మెయిల్ చేస్తుంటాడని ఆరోపించారు. డీకే పెద్ద మోసగాడని, ఆయనకు పోరాడే శక్తి లేదని అన్నారు. 20 రోజుల క్రితం సీడీతో ఒక ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేశాడని పేర్కొన్నారు. 2019లో ఆపరేషన్ కమలం చేపట్టినట్టు అంగీకరించిన రమేశ్ జార్ఖిహోళి.. కొన్ని అనివార్య పరిస్థితుల్లో అది జరిగిందని, డీకే శివకుమార్ నియంతృత్వం, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య వంటి వారి వల్ల చోటుచేసుకొన్నదని చెప్పుకొచ్చారు.