డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే పుష్కర్సింగ్ ధామి ప్రమాణస్వీకారం చేశారు. డెహ్రాడూన్లోని రాజ్భవన్లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రులు సత్పాల్ మహరాజ్, హరాక్సింగ్ రావత్, ఇతర బీజేపీ నాయకులు హాజరయ్యారు.
ఈ ఏడాది మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ రాజీనామా అనంతరం ఆ పదవిని చేపట్టిన తీరథ్ సింగ్ రావత్ ఎక్కువ కాలం సీఎంగా కొనసాగలేకపోయారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలలలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఈసీ ఇప్పట్లో ఉప ఎన్నికలు నిర్వహించేలా లేదు. దాంతో ఆయనకు సీఎం పదవి మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం తీరథ్ సింగ్ రావత్ సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. అనంతరం కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక ప్రక్రియ చకచకా జరిగిపోయింది. శనివారం మధ్యాహ్నం కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమక్షంలో ఉత్తరాఖండ్ బీజేపీ నేతలు సమావేశమై తమ నాయకుడిగా పుష్కర్ సింగ్ ధామిని ఎన్నుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు తెలియజేశారు. ఇవాళ గవర్నర్ సమక్షంలో పుష్కర్సింగ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
ఉత్తరాఖండ్ కొత్త మంత్రులు వీరే..
పుష్కర్ ప్రమాణస్వీకారం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు ఆయన క్యాబినెట్లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో బిషన్సింగ్ ఛుఫాల్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, గణేష్ జోషి, ధన్సింగ్ రావత్, రేఖా ఆర్య, యతీశ్వర్ ఆనంద్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో