పాట్నా : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని జిహాదీలతో పోల్చారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆందోళనబాట పట్టారని వ్యాఖ్యానించారు. దేశానికి సేవ చేయాలనుకునే వారు ఈ స్కీమ్తో సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. దీన్ని ఉద్యోగంగా భావించొద్దు.. దేశానికి సేవగా భావించాలన్నారు. దేశం కోసం ప్రజలు తమ జీవితాలను త్యాగం చేయాలని ఠాకూర్ పేర్కొన్నారు.
విలాసవంతమైన జీవితం గడపాలనుకునే వారికి అగ్నిపథ్ స్కీమ్ సరికాదన్నారు. మీరు ఒక వేళ బీఏ కోర్సు చదివితే.. ఆ డిగ్రీ వచ్చేందుకు ఆరేండ్ల సమయం పడుతోంది. కానీ అగ్నిపథ్ ద్వారా 4 ఏండ్లు దేశానికి సేవ చేసే అవకాశం దక్కుతుందన్నారు. మంచి జీతం, ఉద్యోగ విరమణ ఫండ్స్ కూడా లభిస్తాయన్నారు. పలు రంగాలతో పాటు పారామిలటరీ ఫోర్స్లో పోస్టు రిటైర్మెంట్ జాబ్స్ కూడా లభిస్తాయని ఠాకూర్ పేర్కొన్నారు.