లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో అక్రమ భూముల అమ్మకం వెలుగులోకి వచ్చింది. 40 మంది నిందితుల్లో బీజేపీ నేతలైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతోపాటు మేయర్ కూడా ఉన్నారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు నిందితుల జాబితా విడుదల చేసింది. వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని పేర్కొంది. భవ్య రామాలయం నిర్మిస్తున్న అయోధ్యలో అధికార బీజేపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమంగా భూములు కొనుగోలు చేసి అమ్ముతున్నారు. అక్రమంగా కాలనీలు నిర్మిస్తున్నారు. బీజేపీకి చెందిన స్థానిక ఎంపీ లల్లూ సింగ్ దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు. సిట్ ఏర్పాటు చేసి అక్రమ భూ వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు కూడా అయోధ్య భూ వ్యవహారాలపై పలు ఆరోపణలు చేశాయి.
ఈ నేపథ్యంలో భూముల అక్రమ కొనుగోలు, అమ్మకాలపై అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ దృష్టిసారించింది. అక్రమ భూ లావాదేవీలతోపాటు అక్రమ నిర్మాణాలకు సంబంధించి 40 మంది నిందితులతో కూడిన జాబితాను శనివారం విడుదల చేసింది. ఇందులో బీజేపీ నేతలైన అయోధ్య మేయర్ రిషికేష్ ఉపాధ్యాయ, ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గోరఖ్నాథ్ బాబా పేర్లు ఉన్నాయి. ఈ నిందితులపై చర్యలు తీసుకుంటామని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ తెలిపారు.
మరోవైపు అయోధ్యలో భూముల వ్యవహారంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) మండిపడింది. అయోధ్యలో బీజేపీ నేతల పాపం బయటపడిందంటూ ఒక ట్వీట్ చేసింది. ‘బీజేపీ మేయర్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ల్యాండ్ మాఫియాతో కలిసి అక్రమంగా కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన శాఖలతో కుమ్మక్కై 30 అక్రమ కాలనీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆదాయానికి కోట్లలో నష్టం కలిగించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని అందులో పేర్కొంది.
अयोध्या में भाजपाइयों का पाप!
भाजपा के महापौर, नगर विधायक और पूर्व विधायक भू-माफियाओं के साथ मिलकर बसा रहे अवैध कॉलोनियां।
जिम्मेदार विभागों से सांठगांठ कर अबतक 30 अवैध कॉलोनियां बसाकर सरकार को अरबों रुपए के राजस्व का लगाया चूना।
मामले की हो जांच। दोषियों के खिलाफ हो कार्रवाई। pic.twitter.com/P7CsbA0Igj
— Samajwadi Party (@samajwadiparty) August 7, 2022