న్యూఢిల్లీ, జనవరి 11: ప్రఖ్యాత వార్తాసంస్థ బీబీసీ హిందీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కోపంతో ఊగిపోయాడు యూపీ బీజేపీ మంత్రి. ఏం చేయాలో పాలుపోక జర్నలిస్టు మాస్కును లాగి, మైక్ను పారేయడమే కాకుండా షో మధ్య నుంచే పారిపోయాడు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్యాని బీబీసీ హిందీ ఇటీవల ఇంటర్వ్యూ చేసింది. ‘ధర్మసంసద్’ కార్యక్రమంలో ముస్లింల ఊచకోతపై వివాదాస్పద వ్యాఖ్య లపై మంత్రిని ప్రశ్నించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ సీనియర్ నేతలు ఎవరూ దీన్ని ఖండించకపోవడాన్ని ఎత్తిచూపాడు. దీనిపై స్పందించిన కేశవ్ ప్రసాద్.. మతాధికారులకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుందన్నారు. ఎప్పుడూ హిందూ సంస్థల అధిపతులనే ఎందుకు లక్ష్యంగా చేసుకొంటారని ఎదురు ప్రశ్నించారు. రాజకీయాలకు ఈ ప్రశ్నకు సంబంధం లేదన్నారు. దీనిపై స్పందించిన జర్నలిస్టు.. ఇది ముమ్మాటికీ రాజకీయాలకు సంబంధించినదేనని, ఎన్నికల ముందు ఇలాంటి విద్వేష ప్రకటనలు సమాజంలో చెడు వ్యాప్తికి కారణమవుతాయన్నారు. ఇండియా-పాక్ మ్యాచ్లో నినాదాలు చేస్తేనే దేశద్రోహం కేసులు పెడుతున్నారని, విద్వేష వ్యాఖ్య లు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకొంటారని జర్నలిస్టు మంత్రిని అడిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి ‘నువ్వు అసలు జర్నలిస్టువే కాదు. ఒక వర్గానికి ఏజెంట్లా మాట్లాడుతున్నావ్. నీతో నేను మాట్లాడను’ అంటూ మైక్ తీసివేశారు.