డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. పలు వర్గాల ఓటర్లపై కాషాయ పార్టీ వరాల జల్లు కురిపించింది. తాము అధికారంలోకి వస్తే లవ్ జిహాద్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. లవ్ జిహాద్ కేసుల్లో పదేండ్ల జైలు శిక్ష విధిస్తామని పేర్కొంది. ఛార్దాం హైవేను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. ఉత్తరాఖండ్లో చూస్తున్న అభివృద్ధి పనులు కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ యువతకు 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఉత్తరాఖండ్ను స్వయం సమృద్ధి సాధించేలా రూపొందిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఏడాది మూడు ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, గర్భిణులకు రూ 40,000 సాయం అందిస్తామని మ్యానిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే ఫించన్లను రూ 3600కు పెంచుతామని స్పష్టం చేసింది.
ఇక ఫిబ్రవరి 14న ఒకే దశలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి అధికారంలోకి రావాలని పాలక బీజేపీ పావులు కదుపుతుండగా ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా అందలం ఎక్కాలని విపక్ష కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చెమటోడుస్తోంది.