బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిని మరోసారి మార్చాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరు, నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న అధిష్టానం వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన స్థానంలో మరో నేతను తీసుకురావాలని చూస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో బిజీగా ఉన్న పార్టీ కేంద్ర నాయకత్వం ఈ విషయంపై ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకోనున్నది. బొమ్మై సొంత నియోజకవర్గం హనగల్తో పాటు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురైంది. దీంతో 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకులు కలవరపడుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బొమ్మైకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఓ కొత్త యువ ముఖాన్ని, అది కూడా రాష్ట్రంలో ప్రభావం చూపగల పంచమశాలి లింగాయత్ కమ్యూనిటీ నుంచి బీజేపీ ఎంపిక చేసే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై చర్చలు నడుస్తున్నాయి. సీనియర్ మంత్రులుగా ఉన్న కేఎస్ ఈశ్వరప్ప, మురుగేశ్ నిరానీ, సీసీ పాటిల్, ప్రభు చౌహాన్లను తప్పించే అవకాశం ఉన్నది. ఇప్పటికే 4 బెర్త్లు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవుల కోసం దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేస్తున్నారు.