హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆయిల్పామ్ పంట సాగును ప్రోత్సహించేందుకు 2021-22 బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. ఆయిల్పామ్ సాగుచేసే రైతులకు ఎకరానికి రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మిగిలిన పెట్టుబడి కోసం కూడా రైతులు ఇబ్బందులు పడకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ రుణాలను వెంటనే చెల్లించాల్సిన అవసరంలేకుండా నాలుగేండ్లపాటు మారిటోరియం విధించేలా బ్యాంకులను ఒప్పించింది. నాలుగేండ్ల తర్వాత వాయిదాల పద్ధతిలో రుణాలు చెల్లిస్తే సరిపోతుంది.
మనదేశం ఏటా సుమారు రూ.70 వేల కోట్ల విలువైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నది. దిగుమతులను తగ్గించేందుకు దేశంలోనే ఈ పంటను అధికంగా సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుకు అనుమతి ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ఏటా 2 లక్షల ఎకరాల చొప్పున వచ్చే నాలుగేండ్లలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ను సాగు చేయాలని రాష్ట్రప్రభుత్వ కార్యాచరణ రూపొందించింది. రైతుకు ఒక ఎకరంలో ఆయిల్పామ్ సాగుకు రూ.62,340 ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వమే రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించటంతో రైతు కేవలం రూ.32,340 ఖర్చు చేస్తే సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా బ్యాంకుల నుంచి రుణాలుగా అందించనుంది. ఈ పంట ఒకసారి వేస్తే 30 ఏండ్లు ఆదాయాన్ని ఇస్తుంది.