కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో కాషాయ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇద్దరు బీజేపీ నేతలు వీరంగం వేశారు. జిల్లాలోని చత్నా గ్రామంలో నీటి సమస్యపై నిరసన సందర్భంగా కాషాయ నేతలు ఇష్టారీతిన వ్యవహరించారు. పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్ధానిక బీజేపీ నేత జీవన్ చక్రవర్తి పోలీస్ అధికారిని బెదిరించారు.
పోలీస్ అధికారిని చిప్పకూడు తినేలా చేస్తానని, యూనిఫాం విప్పిస్తానని వ్యాఖ్యానించారు. రౌడీని అనుకుంటున్నావా అంటూ ధ్వజమెత్తారు. పోలీస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేత జీవన్ చక్రవర్తిని ఆపై అరెస్ట్ చేశారు. ఇక జల్పాయిగురిలో మరో బీజేపీ నేత శ్యాం ప్రసాద్ పాలక టీఎంసీ నేతలపై విరుచుకుపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన శ్యాం ప్రసాద్ తాము తృణమూల్ సర్కార్ను అధికారం నుంచి తప్పించాక అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.
తాము ఈ విషయం తృణమూల్ నేతలకే కాకుండా పోలీసులకూ వెల్లడిస్తున్నామని ఆయన బెదిరించారు. తమను మీరు ఎంతగా వేధిస్తే అదేస్ధాయిలో బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు. మీరు మా కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తున్న తరహాలోనే తాము మీ కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. తృణమూల్ రోజులు దగ్గరపడ్డాయని ఇది గుర్తుపెట్టుకోవాలని శ్యాం ప్రసాద్ హెచ్చరించారు.